రైతుల్లారా మీరే తేల్చుకోండి..మూడు పంటలా? మూడు గంటలా? మతాల మంటలా? – కేటీఆర్ ట్వీట్

ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో మంటలు రేపుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ రేవంత్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని దూకుడు పెంచింది. రైతుల్లో కొత్త భయాన్ని తీసుకొచ్చింది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసన గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.

మరోపక్క సోషల్ మీడియా లోను పెద్ద ఎత్తున రేవంత్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్ లో నిత్యం దూకుడు గా ఉండే కేటీఆర్..మరోసారి కాంగ్రెస్ , బిజెపి లపై ఘాటైన ట్వీట్స్ చేసారు. ఈ ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన కామెంట్స్‌ రైతులకు ఇది కాంగ్రెస్‌ నుంచి వచ్చిన రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతుల జాగ్రత్త పడాలని సూచించారు.

కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నారని… ఇప్పుడు అదే రాబందు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారని , నాడు వ్యవసాయం దండగ అన్నారు చంద్రబాబు… నేడు మూడుపూటలు దండగ అంటున్నారు చోటా చంద్రబాబు అంటూ రేవంత్‌పై విమర్శలు చేశారు.

మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం అంటే ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపని కామెంట్ చేశారు. సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అన్నారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమన్నారు. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని స్టేట్‌మెంట్ పాస్ చేశారు.

నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్… నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు కేటీఆర్. మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం అవుతాయన్నారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని తెలిపారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ?? తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

కాసేపటికే మరో ట్వీట్ చేసిన కేటీఆర్‌… కేసీఅర్ నినాదం మూడు పంటలు అయితే.. కాంగ్రెస్ విధానం మూడు గంటలని… బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా… మతం పేరిట మంటలు కావాలా తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని కేటీఆర్ వరుస ట్వీట్స్ చేసారు.