రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు చండూరు మండలం బంగారిగడ్డ లో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పటు చేసింది. ఈ సభ కు సీపీఐ , సీపీఎం పార్టీల నేతలు సైతం హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.
రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నారు. అంటే ఆయనకు బీజేపీ కాంట్రాక్ట్ ఇచ్చినందుకే రాజీనామా చేశానని చెప్పకనే చెప్పారంటూ రాజగోపాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలు మారితే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకముందే.. బీజేపీ వద్ద గత మూడేండ్ల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. ఇలాంటి అవినీతిపరులను, స్వార్థపరులను చిత్తుచిత్తుగా ఓడించాలి. బీజేపీ ఒక దుర్మార్గమైన పార్టీ అని విమర్శించారు.
అలాగే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..బిజెపి ఫై నిప్పులు చెరిగారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో ధర్మయుద్ధం చేస్తున్నాని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడు. ధర్మం అనే పదం కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి వెంట వస్తే అదే ధర్మం సిగ్గుతో తల వంచుకుంటున్నది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్. కానీ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారాడు. అన్నదమ్ములిద్దరికీ గుణపాఠం చెప్పాల్సిన కర్తవ్యం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు.