తెలంగాణ ఆవిర్భావ వేళ కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

ktr

తెలంగాణ ఆవిర్భావ వేళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేసారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని…దశాబ్దం గడిచిన సందర్భమిది అన్నారు. ఆధునిక భారతం కళ్లరా చూసిన.. మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం అని కొనియాడారు. ఒక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన… కేసీఆర్ పోరాట ఫలితమిదని తెలిపారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై… ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదని గుర్తు చేశారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి.. మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిదన్నారు. 60 ఏళ్ల విధ్వంస గాయాలను.. పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణదని పేర్కొన్నారు. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే..

మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిదని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా… అనితర సాధ్యంగా దశాబ్ద ప్రయాణం సాగిందన్నారు. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు… దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ అని కొనియాడారు. నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అని అభివర్ణించారు. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని… తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని… కాంక్షిస్తూ…ఆకాంక్షిస్తూ. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సావ శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేశారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) జాతీయ జెండాను, బీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.