దావోస్‌కు మంత్రి కేటీఆర్..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. ఈ సదస్సు మే 22-26 వరకు జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోపాటు మరికొన్ని రాష్ట్రాల నేతలు హాజరై తమ ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తారని సమాచారం. భారత్‌ నుంచి కనీసం 100 మంది సీఈవోలు, ప్రపంచవ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖులు ఈ సదస్సు కోసం ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు.

అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, ఆయన వారసులు ఈషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలాతోపాటు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, పేటీఎం, యాక్సిస్‌ బ్యాంకు, టాటా స్టీల్‌ తదితర సంస్థల సారథులు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశాలు వాస్తవానికి జనవరి నెలలో జరగాల్సి ఉండగా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతి కారణంగా వాయిదా పడ్డాయి.