ఈటెల రాజేందర్ భద్రతపై మంత్రి కెటిఆర్ ఆరా

ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలన్న కెటిఆర్

ktr-telephones-dgp-regarding-etela-rajender-security

హైదరాబాద్‌ః తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయన భద్రతపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్ర బలగాలతో వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈటల భద్రతపై తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పందించారు.

రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి ఈటల భద్రతపై కెటిఆర్ చర్చించారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర పోలీసు బలగాలతో ఈటలకు అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పారు. కెటిఆర్ ఆదేశాల మేరకు ఈటల భద్రత పెంపుకు సంబంధించి ఈరోజు డీజీపీ సమీక్ష చేయనున్నారు. కాసేపట్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లనున్నారు. తన భర్తకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందంటూ ఈటల భార్య కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.