ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని పశ్చిమ ఢిల్లీ , బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుల హ‌స్తం ఉంద‌ని ..ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కూడా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే రూపొందింద‌ని పర్వేశ్ కీల‌క ఆరోప‌ణ చేశారు.

ఢిల్లీలోని ఒబెరాయ్ హోట‌ల్లో ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ రూపొందింద‌ని ఆయన అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం, లిక్క‌ర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబీకులు ఈ డీల్‌లో ఉన్నార‌ని ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు.. మొదటి ఇన్ స్టాల్మెంట్ కింద రూ.150 కోట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇచ్చారని ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఒబెరాయ్ హోటల్ లోనే పాలసీని రూపొందించారన్నారు. ఇదే మద్యం పాలసీ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలోనూ అమలవుతోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబసభ్యులతో మీటింగ్ జరిపారా ? లేదా ? చెప్పాలని మనీశ్ సిసోడియాను ఎంపీ పర్వేశ్ డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కూడా కీలక ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితే కీలక భూమిక పోషించారని కాంగ్రెస్ నేత మరింత మేర సంచలన ఆరోపణలు చేశారు.