తీవ్ర జ్వరం.. కరీంనగర్ సభకు హాజరుకాలేకపోతున్నః కెటిఆర్‌

ktr-suffering-with-fever-from-two-days

హైదరబాద్ ః బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా విస్తృతంగా అనేక సభలు… సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. అయితే గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా బిఆర్ఎస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్‌లో జరుగుతున్న భారీ బహిరంగసభకు హాజరు కాలేకపోతున్నట్లు కెటిఆర్ తెలిపినట్లు వెల్లడించింది.

డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే కెటిఆర్ చికిత్స తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయమవుతుందని డాక్టర్లు తెలిపారని పేర్కొంది. కరీంనగర్ సభ విజయవంతమయ్యేలా పార్టీపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కెటిఆర్ చెప్పారని పేర్కొంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లుగా కెటిఆర్ వెల్లడించారు.