తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కెటిఆర్‌ కీలక వ్యాఖ్యలు

అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే ఎన్నికలు.. లేదంటే ఏప్రిల్ , మేలో ఉండవచ్చు..

ktr-hot-comments-on-telangana-assembly-elections

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కెటిఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అన్నారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చు, ప్రజలకు ఇబ్బంది తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా జమిలి ఎన్నికల వైపు నరేంద్ర మోడీ సర్కార్ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కెటిఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.