కోమటిరెడ్డి రాజగోపాల్ ఫై మంత్రి కేటీఆర్ ఫైర్
మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ఫై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి, స్థానిక ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు. కాంట్రాక్టుల కోసమే మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని, రాజగోపాల్ రెడ్డి ఒక అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి హామీలు, ప్రలోభాలతో ప్రజలను మోసం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమిషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవీ కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.