సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన కెటిఆర్
నేడు ఆర్మూర్, కొడంగల్లో రోడ్ షోలు
సిరిసిల్ల: బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్లో పూజలు చేసి తండ్రి సిఎం కెసిఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయలుదేరారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో 11.45 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. నేడు ఆర్మూర్, కొడంగల్లో కెటిఆర్ రోడ్షో నిర్వహించనున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు మరొక్క రోజే (శుక్రవారం) మిగిలి ఉండడంతో నేతలు బిజీగా మారిపోయారు. నామినేషన్లతో ఆర్వో కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఈసారి గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొద్దిసేపటి క్రితం గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో గజ్వేల్ చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డికి బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలలోపు నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మాట్లాడతారు.