ఫైబర్ నెట్ కేసు..అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దుః సుప్రీంకోర్టు ఆదేశం
క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి తర్వాత వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీః ఫైబర్ నెట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ పై విచారణ గత నెలలోనే ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది.