ఖమ్మంలో హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం..?

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య వాడివేడి ప్రచారం నడుస్తుంది. ఈ తరుణంలో ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా రామ సహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు కాల్వ ఒడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ రేణుక చౌదరి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ తన స్వగ్రామమని చెప్పారు. తమ భూములను ప్రజల కోసం దానం చేశామని అన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతులేకుండా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం ఉందని ఉద్ఘాటించారు. తనకు ఎంపీగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.