సీఎం జగన్‌తో కేశినేని నాని భేటి

టిడిపికి దూరంగా ఉంటున్న కేశినేని నాని

Keshine Nani

అమరావతిః ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపికి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం జగన్ ను కలిశారు. కేశినేని నాని, తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిరువురు సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టిడిపికి గుడ్ బై చెప్పడం తెలిసిందే. ఒకవేళ కేశినేని నాని వైఎస్‌ఆర్‌సిపిలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. కేశినేని నాని టిడిపికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించగా… కేశినేని శ్వేత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టిడిపి జెండాలను, చంద్రబాబు ఫొటోలను వారు కొన్నిరోజుల కిందటే తొలగించారు. ఇక వారు పార్టీకి రాజీనామా చేయడమే మిగిలుంది.