కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత..

కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ (80) తుదిశ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన బెంగళూరు లోని చిన్మయ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.25 గంటలకు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.