ఏపి స్పీకర్ కు లేఖలు రాసిన వైఎస్‌ఆర్‌సిపి రెబల్ ఎమ్మెల్యేలు

విడివిడిగా లేఖలు రాసిన ఆనం, మేకపాటి, కోటంరెడ్డి, శ్రీదేవి

ysrcp-rebel-mlas-letter-to-speaker-tammineni-sitaram

అమరావతిః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు. తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈమేరకు వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉందని, తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని ఈ లేఖలో కోరారు. వాటిని పరిశీలించేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనైతికంగా పార్టీ మారారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు.