కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది..

ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ఈరోజు తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోవడం తో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్​నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి 20వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. ఈ ఆలయం సంవత్సరంలో చాలాకాలం పాటూ మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో భయంకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆలయాన్ని ముూసివేస్తారు.

ఇప్పుడు మళ్లీ పరిస్థితులు సాధారణం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరచుకున్నది. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భక్తుల కోసం మంగళవారం తెరిచారు. కేదార్‌నాథ్‌ ఆలయం నేడు తెరచుకోగా, ఈ నెల 8న బద్రినాథ్‌ ఆలయాన్ని తెరవనున్నారు. బద్రీనాథ్‌కు రోజుకు 15 వేల మంది, కేదార్‌నాథ్‌కు 12 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, యమునోత్రికి 4 వేల మంది భక్తులకు అనుమతించనున్నారు.