నూతన సచివాలయంలో నేడు సీఎం కేసీఆర్ తొలి సమీక్ష
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం తొలి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ నూతన సచివాలయం కొలువుదీరింది. అంగరంగ వైభవంగా అత్యంత అట్టహాసంగా పాలనా సౌధం ఆదివారం ప్రారంభోత్సవం జరిగింది. సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో తొలి దస్త్రంపై సంతకం చేశారు. తన చాంబర్ లో ఆసీనులయ్యారు.
సోమవారం మధ్యాహ్నం తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల పనులపై కూడా కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.