జై భీమ్ అని నిన‌దించిన ముఖ్య‌మంత్రి కెసిఆర్

హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బౌద్ధ భిక్ష‌వులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. అంతకు ముందు ప్రగతి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఆర్ అంబేద్కర్‌ మ‌నువ‌డు ప్రకాశ్‌ అంబేద్కర్‌ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్రకాశ్‌ అంబేద్కర్‌ను కేసీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో క‌లిసి ప్రకాశ్‌ అంబేద్కర్‌ భోజనం చేశారు. అనంతరం విగ్రహావిష్కరణ కోసం ప్రగతి భవన్‌ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు.

ఇక ఈ మహావిగ్రహ ప్రత్యేకతలు, చూస్తే..

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో దాదాపు 11.80 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహ నిర్మాణం చేపట్టారు.

విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.

ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. మెుత్తంగా భూమి నుంచి స్మారకం ఎత్తు 175 అడుగులు.

రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహ నిర్మాణం చేపట్టారు.

ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడి వాడారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహ నిర్మాణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు

దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది రికార్డు నెలకొల్పింది .

పార్లమెంట్ ఆకారంలో రెండు ఎకరాల్లో పీఠం నిర్మాణం చేపట్టారు. పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇందులో ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటుకానుంది.

భవనం లోపల ఆడియో విజువల్‌ రూమ్స్‌ ఉన్నాయి. లైబ్రరీలో అంబేడ్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేసారు.

2.93 ఎకరాల్లో థీమ్ పార్కుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు రాక్‌గార్డెన్‌, , వాటర్‌ ఫౌంటేన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌శాండ్‌ స్టోన్‌ ఉన్నాయి. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.