జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అంగడా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. యాసంగి సీజన్‌లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది.