సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన పొన్నాల లక్ష్మయ్య

సీఎం కేసీఆర్ ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. బుధువారం ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ సభ పట్ల ఆయన స్పందించారు. ఈ సందర్భాంగా పొన్నాల మాట్లాడుతూ ..ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. ఐదు లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోడీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ గురువింద గింజ నీతులు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు సంక్రాంతికి ఆధునిక తుపాకీ రాముడు మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోడీ లు ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. దళిత బంధు పేరు చెప్పి తెలంగాణలోని దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని… రాష్ట్రంలో 17 లక్షల మంది అర్హులు ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 30 వేల మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అది కూడా ఆపేసే అవకాశముందని పొన్నాల అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టామని.. సీఎం కేసీఆర్‌ చంచల్‌గూడ జైలుకు వెళ్లటం ఖాయమని పొన్నాల అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఇప్పటికీ నీళ్లు తాగలేని దుస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రజలకు 9 రకాల సరుకులు ఇచ్చినట్టు గుర్తుచేసిన పొన్నాల.. బీఆర్ఎస్ సర్కార్ కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని అన్నారు.