పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు పాలేరని తానే ఒప్పుకున్నారు -మంత్రి జోగి ర‌మేష్‌

జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పొత్తులతో కలిసి ఎన్నికల్లో దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం పట్ల టీడీపీ , జనసేన పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుంటే వైస్సార్సీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వారి స్టయిల్ లో విమర్శలు చేయగా..మంత్రి జోగి ర‌మేష్‌ పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు పాలేరని అన్నారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట ముంచారని కార్యకర్తలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు.

పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆత్మరక్షణలో పడ్డారు. పవన్‌ ప్యాకేజీ స్టార్‌ తప్ప పాలకుడు కాదని మేం చెబుతూనే ఉన్నాం. పవన్‌ పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తి. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్‌ ఒప్పుకున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ జనసేన నేతల పేరుతో టీడీపీ వారే పోటీ చేస్తారు. జనసైనికులు కూడా పాలేరులుగా మారకుండా నిర్ణయం తీసుకోవాలి.

గతంలో పవన్ కుటుంబ సభ్యులను సైతం చంద్రబాబు మనుషులు బూతులు తిట్టారు. పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్‌ ఏమీ సాధించలేక పోయాడు. చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి. పాలకుడు ఎవరో, పాలేరు ఎవరో గుర్తించి వ్యవహరించాలి అంటూ మంత్రి జోగి ర‌మేష్‌ సూచనలు చేశారు.