బిజెపి బీ టీం బిఆర్ఎస్ అని మరోమారు అర్థమైందిః భట్టి విక్రమార్క

రాష్ట్రంలో బిజెపి పని అయిపోయింది..భట్టి

Bhatti Vikramarka

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌-సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భేటీపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి భరతం పట్టేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని, ఈ నేపథ్యంలో కూటమిలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే అఖిలేశ్‌తో భేటీ అయ్యారని అన్నారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాజా పరిణామాలు చూస్తుంటే బిఆర్ఎస్ ముమ్మాటికీ బిజెపి బీ టీం అన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సామాజికంగా విభజించిన కెసిఆర్ తెలంగాణను పునర్నిర్మిస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి పని అయిపోయిందన్న భట్టి.. మున్ముందు కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని పేర్కొన్నారు.