కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్ జైలులో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని.. జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. కవిత పిటిషన్లను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.