నేటి నుండి కర్తార్పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం

న్యూఢిల్లీ: నేటి నుంచి కర్తార్పూర్ కారిడార్ యాత్ర మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తాజాగా ఇరు దేశాల సరిహద్దుల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు యాత్రను ఈరోజు నుంచి పునఃప్రారంభించనున్నారు. దీంతో మంగళవారం 132 మంది సిక్కు భక్తులు కర్తార్ పూర్ కారిడార్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారని గురుదాస్పూర్ డీసీపీ తెలిపారు.
కాగా, పాకిస్థాన్లోని కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనిని భారత్లోని గురుదాస్పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్తో కలుపుతూ కర్తార్పూర్ కారిడార్ నిర్మించారు. యాత్రికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వీటిని సందర్శించడానికి భారత్-పాక్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2019 నవంబర్ 9న కర్తార్పూర్ కారిడార్ యాత్ర ప్రారంభమైంది.