కర్ణాటక లో బిజెపి మరో షాక్ : కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం

మరికొద్ది రోజుల్లో కర్ణాటక లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో బిజెపి పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు కమలానికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోగా, తాజాగా మాజీ సీఎం, సీనియర్‌ నేత జగదీశ్‌ శెట్టర్‌ కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈయన ..సోమవారం కాంగ్రెస్ లో చేరారు.

బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ కు కాంగ్రెస్ తరుపున టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్.. గతంలో కర్ణాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

సీనియర్‌ నాయకుడనైన తనకు బీజేపీ నుంచి టిక్కెట్‌ వస్తుందని అనుకున్నాననని జగదీశ్ శెట్టర్ అన్నారు. కానీ నాకు అది రాలేదని తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఎవరూ తనతో మాట్లాడలేదని.. కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తనకు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని జగదీశ్ శెట్టర్ అన్నారు.