విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విన్నపంః కేఏ పాల్

KA Paul appealed to the people to win as Visakha MP

అమరావతిః రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సొంత తల్లిని, చెల్లెలిని కూడా మోసం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవాడా? అని ప్రశ్నించారు. ఈరోజు నుంచి జగన్ పై యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డి జైలుకి వెళ్లేవారేనని అన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను తాను కలిశానని… తనకు గౌరవం ఇవ్వని నాయకులు చంద్రబాబు, జగన్ అని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలో, సర్వ అభివృద్ధి చేసే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేఏ పాల్ అన్నారు. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, జీవీఎల్ పోటీ చేయవద్దని కోరుతున్నానని చెప్పారు. బొత్స ఝాన్సీ పోటీ చేస్తే బొత్స అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. జనసేనలో టికెట్ రాని నేతలంతా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని అన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపిని విలీనం చేయొద్దని షర్మిలకు తాను చెప్పానని అన్నారు.