పేద దేశాలకు టీకాలు అందాలి.. డబ్ల్యూహెచ్వో చీఫ్
జెనీవా: పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ప్రపంచ దేశాలను కోరారు. టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని పేద దేశాలకు మాత్రం అందడం లేదని చెప్పారు. కరోనాతో ముప్పు లేని యువతకు కూడా ధనిక దేశాలు వ్యాక్సిన్లు అందిస్తుండగా పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి కూడా అందడం లేవని ఆయన తెలిపారు. దీంతో ఆఫ్రికాలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. వారం రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు, మరణాలు 40 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. డెల్టా వేరియంట్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సినేషన్ అందించడంలో విఫలమవుతున్నామని చెప్పారు. వ్యాక్సిన్ల సరఫరా సమస్యగా మారిందని ఆయన చెప్పారు. ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు పంపాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ల విషయంలో వివక్ష కొనసాగుతోందని తెలిపారు.
కాగా, ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందించాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్వో ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమానికి టీకాల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఆస్ట్రాజెనికా, సీరం, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల నుంచి ఈ నెలలో ఒక్క డోసు కూడా అందలేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ వ్యాక్సిన్ల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో సీరం నుంచి డబ్ల్యూహెచ్వోకు అందాల్సిన వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/