జూన్ 8న కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి?

బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జూన్ 8న జూపల్లి తో పాటు వనపర్తి జిల్లా నేతలు కిచ్చారెడ్డి, మెఘారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదే రోజున జూపల్లి అనుచరులు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా జూపల్లి తో బిజెపి నేతలు సమావేశాలు అవుతూ తమ పార్టీ లో చేరాలని కోరుతున్నారు. కానీ జూపల్లి మాత్రం కాంగ్రెస్ లోనే భవిష్యత్ ఉంటుందని భవిస్తూ..ఆ పార్టీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూపల్లి చేరితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే జూపల్లి కొన్ని కండీషన్లు పెడుతున్నారు. తనతో పాటు పార్టీలో చేరే పెద్దమందడి ఎంపీపీ మెఘారెడ్డికి టికెట్‌పై హామీ ఇవ్వాలని కోరుతున్నారు. కొల్లాపూర్ టికెట్ తనకు ఇవ్వాలని, వనపర్తి నుంచి మెఘారెడ్డికి టికెట్ ఇచ్చేలా హామీ ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఆయన ప్రతిపాదనలకు ఓకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే జగదీశ్వరరావు, అభిలాషరావులు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.