నేడు కవిత బెయిల్ పిటిషన్లపై వెలువడనున్న తీర్పు

Judgment on Kavitha bail petitions today

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా… మధ్యాహ్నం 12 గంటలకు తీర్పును వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కేసులకు సంబంధించి కవిత రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లాలని కోరుతూ సీబీఐ కేసులో కవిత బెయిల్ కోరారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా తాను బాధ్యతలను నిర్వహించాల్సి ఉందని చెపుతూ ఈడీ కేసులో బెయిల్ ను అభ్యర్థించారు. మరోవైపు రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈరోజు ఆమెకు బెయిల్ రాకపోతే రేపు ఆమెకు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది.