భయపడే వాడు మోడీ కాదు..సంక్షేమం కోసం అడుగు ముందుకే వేస్తాను: ప్రధాని మోడీ
చత్తీస్గఢ్లో మార్పు గాలి వీస్తోందని వ్యాఖ్య
చత్తీస్గఢ్: తాను దేనికీ భయపడే వాడిని కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చత్తీస్గఢ్లో అవినీతి ప్రభుత్వాన్ని బిజెపి వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు చత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని.. ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బఘెల్ సమక్షంలోనే కాంగ్రెస్ లక్ష్యంగా మాటల దాడి చేశారు.
చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రూ.7,600 కోట్ల ప్రాజెక్టుల్లో కొన్ని ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘భయపడే వాడు మోదీ కాదు. కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. చత్తీస్గఢ్ సంక్షేమం కోసం అడుగు ముందుకే వేస్తాను. వెనక్కి తగ్గేదే లేదు” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల శత్రువు అని ఆరోపించారు.
చత్తీస్గఢ్లో మార్పు గాలివీస్తోందని ప్రధాని చెప్పారు. ‘‘ఛత్తీస్గఢ్ అభివృద్ధికి అడ్డుగోడలా ఓ పంజా (హస్తం) నిలిచింది. అది కాంగ్రెస్ పంజా. మీ హక్కులను లాగేసుకుంటోంది. మిమ్మల్ని దోచుకోవాలని, ఛత్తీస్గఢ్ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది” అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.