రెండో రోజు ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్ః టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాల కొనుగోలు విషయంలో ఈడీ అధికారుల ఎదుట రెండో రోజు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. నిన్న 8 గంటల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వాహనాల కొనుగోలు స్కామ్లో జేసీ ప్రభాకర్రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే నిన్న ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు.
కాగా, గతంలో ఏపీ రవాణా శాఖ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను రెండు కంపెనీలకు తుక్కు కింద కొనుగోలు చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని నాగాలాండ్లో బీఎస్-4 వాహనాల కింద రిజిస్ట్రేషన్ చేయించి.. ఏపీకీ బదిలీ చేయించారని రవాణా శాఖ అధికారులు అందులో తెలిపారు.ఇందుకోసం నకిలీ ధ్రువపత్రాలను సృష్టించినట్లు రవాణా శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం రవాణా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ సోదరులపై కేసు నమోదు చేశారు. పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే జూన్ 17న అనంతపురం తాడిపత్రిలోని జేసీ సోదరుల నివాసాలతో పాటు హైదరాబాద్లోనూ సోదాలు నిర్వహించారు. జేసీ సోదరుల చరవాణిలతో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/