బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి బుధువారం బిజెపి లో చేరారు. కొద్దీ రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధిస్తున్నాడని, మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి , వార్తల్లో నిలిచింది.

తాజాగా ఈరోజు బుధువారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీలో తనను అణచివేశారని.. తన ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.