ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ నామినేషన్ దాఖలు

న్యూఢిల్లీః పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగదీప్ నామినేషన్ పత్రంపై ప్రధాని మోడి సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
జాట్ వర్గానికి చెందిన ధన్ఖడ్ను ఎంపిక చేయడం ద్వారా రాజస్థాన్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లను మచ్చిక చేసుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. పైగా పశ్చిమబెంగాల్ సీఎంతో తరచూ విబేధిస్తూ ఆమెను ఇరుకున పెట్టినందుకు ప్రయత్నించిన ధన్ఖడ్కు బహుమతిగా ఈ పదవి ఇస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు. 1951 మే 18న రాజస్థాన్లోని జుంజును జిల్లా కిథానా గ్రామంలో జగదీప్ ధన్ఖడ్ జన్మించారు. జైపూర్లోని మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, రాజస్థాన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం విద్యనభ్యసించారు. 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్ మెంబర్గా నమోదు చేసుకున్నారు. చాలా ఏండ్ల పాటు రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/