ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు ఆవిరవుతాయిః రఘురాజు

raghu ramakrishna-raju

అమరావతిః ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని ఎదురు చూడబోతోందని టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. జూన్ 4న వెలువడబోయే ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు ఆవిరవుతాయని చెప్పారు. వైసీపీకి కనీసం 25 అసెంబ్లీ స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని… చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు.

మరోవైపు నిన్న ఐప్యాక్ ప్రతినిధులను కలిసిన జగన్… మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని… ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచించలేనన్ని సీట్లు వైసీపీకి వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు రఘురాజు కౌంటర్ ఇచ్చారు.