కాసేపట్లో కుప్పంలో కృష్ణా జలాలను విడుదల చేయబోతున్న సీఎం జగన్

కాసేపట్లో కుప్పంలో సీఎం జగన్ కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. క్యాంపు ఆఫీస్ నుండి బయలుదేరిన జగన్.. రాజుపేట్, రామకుప్పం మండలం హెలిప్యాడ్‌ చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజలు చేసి హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల చేస్తారు. అనంతరం గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.

సీఎం తన పర్యటనలో.. తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు.

కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ-నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి.