రేపు , ఎల్లుండి అన్నమయ్య, వైయ‌స్ఆర్‌ జిల్లాలో జగన్ పర్యటన

రెండు రోజుల పాటు సీఎం జగన్ అన్నమయ్య, వైయ‌స్ఆర్‌ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసింది. రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఆ తర్వాత ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్‌ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఎల్లుండి ఉదయం RK ర్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లను స్టార్ట్ చేస్తారు. ఆ మధ్యాహ్నం తాడేపల్లికి బయలు దేరి వెళ్తారు.