నేడు సీఎం జగన్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 10:20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రుషికొండ వద్ద ఉన్న ఐటీహిల్స్‌లోని నెంబర్ 3కి వెళ్లనున్నారు. అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిల్ నెంబర్ 2 కి చేరుకొని ఇన్ఫోసిస్‌ నిర్మించిన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ డెవలప్‌మెంట్ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో దీన్ని రూపొందించారు.

మధ్యాహ్నం 12:15 గంటలకు పరవాడ ఫార్మా సిటీకి చేరుకుంటారు. అక్కడ యూజియా స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ప్రారంభిస్తారు. ఫార్మా, బయెటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 300.78 కోట్లతో ఈ పరిశ్రమను నిర్మించారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

ఆ తర్వాత 1:30 PM గంటలకు అచ్యుతాపురానికి చేరుకుంటారు. యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అక్కడ నిర్మించిన ఈ యూనిట్‌ను జగన్ ప్రారంభిస్తారు. ఈ యూనిట్‌ ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి లారెస్ ల్యాబ్‌కు చేరుకొని అక్కడ నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అలాగే లారస్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకు కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు.