జగన్ కోడికత్తి కేసు.. విశాఖకు బదిలీ
అమరావతి : సిఎం జగన్పై జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయ్యింది . ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగిన విచారణలు ఇకపై విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని మంగళవారం విజయవాడలో జరిగిన కోర్టు విచారణలో న్యాయమూర్తి వెల్లడించారు. 2018 అక్టోబర్లో విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని అదే సమయంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ నడుస్తుంది.
అయితే నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరుఫున వాదిస్తున్న న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం కేసు విచారణలోకి వచ్చింది. దీంతో పాటు ఈ కేసుపై సీఎం జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఇదిలాఉండగా విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టు విశాఖకు బదిలీ చేస్తున్నందున ఇకపై విశాఖలో కేసు విచారణ కొనసాగుతుందని జడ్జి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ ఆగస్టు 8న నిర్వహించాలని ఆయన ఆదేశించారు.