పర్యాటక రంగంలోనే రూ. 22 వేల కోట్ల పెట్టుబడులుః మంత్రి రోజా

జగన్ అంటే ఒక బ్రాండ్ అన్న రోజా

jagan-is-a-brand-says-roja

విశాఖః జగన్ అంటేనే ఒక బ్రాండ్… జగన్ అంటేనే ఒక జోష్ అని ఏపీ పర్యాటక మంత్రి రోజా కొనియాడారు. కేవలం జగన్ పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. కేవలం పర్యాటక రంగంలోనే రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని… ఈ స్థాయిలో పర్యాటక రంగానికి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని చెప్పారు. సమ్మిట్ లో చేసుకున్నవి గత ప్రభుత్వం మాదిరి నామమాత్రపు ఒప్పందాలు కాదని… ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్తామని తెలిపారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఏపీ వైపు చూస్తాయని చెప్పారు.

తిరుపతిని టెంపుల్ టూరిజంగా, విశాఖను ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని రోజా అన్నారు. విశాఖ, తిరుపతి, గండికోట, పిచ్చుకలంకలో ఒబెరాయ్ సంస్థ కొత్త హోటల్స్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఢిల్లీవాడు వెక్కిరించినా, మద్రాస్ వాడు వెళ్లగొట్టినా, హైదరాబాద్ వాడు గెంటేసినా… తమ కాళ్లమీద తాము నిలబడుతున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా వైజాగ్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.