తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు

it-officials-raided-16-places-in-telugu-states

హైదరాబాద్‌ః ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా వెలుగులోకి తెచ్చారు ఐటీ అధికారులు. ఈ స్కామ్‌లో చార్టెడ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీగా లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు.

ఇంకా వందల మందిని ఐటీ ఆఫీస్‌కి పిలిచి మరీ విచారించారు అధికారులు. హైదరాబాద్‌లో 8 ప్రాంతాలతోపాటు.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో కోట్లలో స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆదాయపు పన్ను శాఖలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. సోదాలు పూర్తయితే ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎంతెంత మేర కుంభకోణం చేశారో తెలియనుంది.