ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు
గాజా: మరో రెండు రోజులు పాటు ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు ఒప్పందాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వంవహిస్తున్న ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ పొడిగింపు అమలులో ఉన్న రోజులు అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా మరో 33 మంది ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.
తొలుత కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నాలుగు విడుతల్లో 69 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. ఆదివారం అర్ధరాత్రి నాటికి మూడు విడుతల్లో 58 మందిని వదిలేసిన హమాస్.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరో 11 మందిని రెడ్క్రాస్కు అప్పగించింది. వారిలో ముగ్గురు ఫ్రెంచ్ జాతీయులు ఉండగా, ఇద్దరు జర్మనీ, ఆరుగురు అర్జెంటీనాకు చెందినవారు ఉన్నారు.