నేటి నుండి ఇంటర్ కాలేజీలు ఓపెన్

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలలో కొత్త విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌లో కొత్తగా చేరిన విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1,443 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యుపెన్సి భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లోని సెకండ్ ఇయర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది.

తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు మే 31తో ముగిసాయి. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల జూనియర్ కాలేజీలకు మార్చి 31 నుంచి సెలువులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 31 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 30 నాటికి మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. మొదటి దశ ప్రవేశాలు పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

అటు పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదంటూ హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర/CBSE/ ICSE పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ & బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదని… కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు.