ప్రముఖ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ స్పిన్ ఆల్రౌండర్ సలీమ్ దురానీ (88) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నసలీమ్.. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్లో జామ్నగర్లో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో కింద పడిపోవడంతో దురానీ తొడ ఎముక విరగ్గ శస్త్ర చికిత్స జరిగింది.
దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్లోని కాబూల్ లో జన్మించారు. తన 8 నెలల వయసులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్కు వచ్చేసింది. 1960లో ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్రౌండర్గా గుర్తింపుపొందారు.
1971లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ తరఫున దురానీ 29 టెస్టు మ్యాచ్లు ఆడి ఒక శతకం, 7 అర్ధ సెంచరీలతో మొత్తం 1,202 పరుగులు చేశారు. అదేవిధంగా 75 వికెట్లు పడగొట్టారు. 1961-62లో ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0తో గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.