సిక్సులతో మెరిసిన షమీ.. కోహ్లీ ముసిముసి నవ్వులు

తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకు భారత్ ఆలౌట్

Virat kohli and Mohammed shami
Virat kohli and Mohammed shami

క్రైస్ట్‌చర్చ్‌: టీమిండియా ఫేమస్‌ బౌలర్‌ మహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలు కాసేపు న్యూజిలాండ్ బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా విధ్వంసకర బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో షమీ వరుసగా రెండు సిక్స్ లను బాదాడు. అంతకుముందు ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క సిక్స్ ను ఓపెనర్ పృథ్వీ షా కొట్టాడు. ఆపై మరే ఆటగాడూ సిక్స్ సాధించలేదు. అటువంటి పిచ్ పై షమీ రెండు వరుస సిక్స్ లను సాధించడంతో మైదానమంతా భారత ఫ్యాన్స్ కేరింతలతో నిండిపోయింది. ఆ సమయంలో పెవీలియన్ లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముసిముసి నవ్వులు చిందించడం కనిపించింది.

ఆ తరువాతి బంతి బలంగా హెల్మెట్ ను తాకడంతో కాసేపు బాధపడిన షమీ, మరుసటి బంతిని బ్యాలెన్స్ చేయలేక, వికెట్లు ముందు దొరికి పోవడంతో భారత ఇన్నింగ్స్ 63 ఓవర్లకు 242 పరుగుల వద్ద ముగిసింది. భారత తొలి ఇన్నింగ్స్ లో షా 54, అగర్వాల్ 7, పుజారా 54, కోహ్లీ 3, రహానే 7, హనుమ విహారి 55, రిషబ్ పంత్ 12, జడేజా 9, ఉమేశ్ యాదవ్ 0, మహమ్మద్ షమీ 16 పరుగులు చేసి అవుట్ కాగా, జస్ ప్రీత్ బుమ్రా 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జెమీసన్ 5, టిమ్ సౌథీ, బౌల్ట్ లకు చెరో రెండేసి, వాగ్నర్ కు 1 వికెట్ దక్కాయి. మరికాసేపట్లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/