ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ , హరియాణా రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్, పౌరి గర్వాల్, నైనిటల్, ఉదమ్ సింఘ్ నగర్, తెహ్రీ, చంపావత్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.