నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయబోతున్నది. ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం తెలంగాణేనని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతున్నదని తెలిపారు. పేద ముస్లింలకు ఈ ఏడాది 4.50 లక్షల గిఫ్ట్ ప్యాక్లు అందజేశామని వెల్లడించారు. బుధవారం విందులో సీఎం కేసీఆర్ అనాథ ముస్లిం పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు. విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 13 వేల మందికి ఆహ్వానాలు పంపామని చెప్పుకొచ్చారు.