తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైతే.. మహారాష్ట్రలో ఎందుకు కాదు? : సిఎం కెసిఆర్‌

బిఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని వెల్లడి

if-development-possible-in-telangana-then-why-not-in-maharashtra-asks-cm-kcr

సోలాపుర్‌: కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని బిఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేర్కొన్నారు. అలాంటిది అన్ని వనరుల పుష్కలంగా ఉన్న మహారాష్ట్ర మాత్రం అభివృద్ధిలో వెనుకబడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రైతులంతా బిఆర్ఎస్ తో ఉంటే మిగతా పార్టీలే మనకు బీ టీమ్ లుగా మారుతాయని చెప్పారు. బిఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కెసిఆర్‌ కొత్త నిర్వచనం చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని కెసిఆర్‌ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన భాజాపా.. అందరికీ మీరు అవకాశం ఇచ్చారని చెప్పారు. రైతులకు మంచి చేయాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే వీళ్లలో ఎవరైనా చేయగలిగే వారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేని వాళ్లకు అధికారం కట్టబెట్టొద్దని అన్నారు. బిఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని పేర్కొన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ముందుకు వెళుతున్నామని కెసిఆర్‌ చెప్పారు.