ఆదివారం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని చూసేందుకు పోటీపడ్డ నగరవాసులు
దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని అవిష్కరించారు. ఇక ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు ఆదివారం నగరవాసులు పోటెత్తారు.
హుస్సేన్సాగర్ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన అంబేడ్కర్ మహా ప్రతిమను వీక్షించి సందర్శకులు పులకించిపోయారు. సెల్ఫీలు తీసుకొని.. ఎంతో సంతోషపడ్డారు. ఆ మహనీయుడికి మహా విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నగరం నలుమూలల నుంచి సందర్శకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరలిరావడంతో ట్యాంక్బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, నెక్లెస్ రోడ్లన్నీ కిటకిటలాడాయి.
ఇక ఈ మహావిగ్రహ ప్రత్యేకతలు, చూస్తే..
హుస్సేన్సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో దాదాపు 11.80 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహ నిర్మాణం చేపట్టారు.
విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. మెుత్తంగా భూమి నుంచి స్మారకం ఎత్తు 175 అడుగులు.
రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహ నిర్మాణం చేపట్టారు.
ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడి వాడారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహ నిర్మాణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు
దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది రికార్డు నెలకొల్పింది .
పార్లమెంట్ ఆకారంలో రెండు ఎకరాల్లో పీఠం నిర్మాణం చేపట్టారు. పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇందులో ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసారు.
భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్ ఉన్నాయి. లైబ్రరీలో అంబేడ్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేసారు.
2.93 ఎకరాల్లో థీమ్ పార్కుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు రాక్గార్డెన్, , వాటర్ ఫౌంటేన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్శాండ్ స్టోన్ ఉన్నాయి. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.