భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అత్యాధునిక సి-295

మొదటి విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ కు అప్పగించిన స్పెయిన్

IAF chief takes delivery of first C-295 transport aircraft in Spain

న్యూఢిల్లీః భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. తొలి విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి మన దేశానికి చేరుకోనుంది. ఈమేరకు బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌధురి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారుల నుంచి అందుకున్నారు. అందులో కాసేపు ప్రయాణించి విమానం పనితీరును పరీక్షించిన చౌధురి మాట్లాడుతూ.. సీ–295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు రూ.22 వేల కోట్లతో డీల్ కుదిరిందని, ఇందులో 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు.

మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్ లోని వడోదరలో తయారు చేయడానికి టీఏఎస్ఎల్ కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. కాగా, వడోదరలో 2024 నవంబర్ లో ఈ విమానాల తయారీ ప్రారంభం కానుందని తెలిపారు. సీ–295 యుద్ధ విమానం చేరికతో భారత వాయుసేన మరింత పటిష్ఠం అవుతుందన్నారు. ఈ విమానంలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించవచ్చని వివరించారు. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ అభిప్రాయపడ్డారు. సీ–295 విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి ఇండియాకు బయలుదేరనుందని చెప్పారు.