రామచంద్రన్ను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన బెంగళూరు కోర్టు
బెంగళూరుః దేవాస్ మల్టీమీడియా సంస్థ సీఈవో రామచంద్రన్ విశ్వనాథన్ ను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించారు. బెంగుళూరులోని స్పెషల్ కోర్టు ఓ కేసులో ఈ ప్రకటన చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీల్యాండరింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం 9 మందిపై ఆరోపణలు ఉన్నాయి. ఇస్రోకు చెందిన వాణిజ్య శాఖ ఆంట్రిక్స్ కార్పొరేషన్ 579 కోట్లలో దాదాపు 85 శాతం నిధుల్ని అమెరికాకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018లో నమోదు అయిన ఆ కేసులో రామచంద్రన్పై ఈడీ నజర్ పెట్టింది. ఆ కేసు ఆధారంగానే రామచంద్రన్ను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించారు.
ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలను దేవాస్ వాడుకునే రీతిలో ఒప్పందం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు మల్టీమీడియా సేవల్ని అందిచాలన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. అయితే దేవాస్ మల్టీమీడియా కంపెనీని జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ లిక్విడేట్ చేసింది. తొలుత సీబీఐ, ఆ తర్వాత ఈడీ వేర్వేరు కేసుల్ని నమోదు చేసింది. ఈ కేసులో విశ్వనాథన్ రెండో నిందితుడిగా ఉన్నారు. ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ గురువారం రోజున ఈ కేసుకు సంబంధించిన పత్రాలను జడ్జి కేఎఏల్ అశోక్కు సమర్పించారు. విశ్వనాథన్ను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించాలన్నారు. ఆయన ప్రాపర్టీలను సీజ్ చేయాలని సూచించారు. విశ్వనాథన్కు నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్ సెక్షన్ 2(ఎఫ్) కింద కోర్టు విశ్వనాథన్ను దోషిగా తేల్చింది.